
- ఆపరేషన్ స్మైల్ విజయవంతం
- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రణం న్యూస్, క్రైం : ఆపరేషన్ స్మైల్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 మంది చిన్నరులకు విముక్తి కలిగించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గత నెల జనవరి మొదటి తారీఖు నుంచి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులు, బడి మానేసిన 161 మంది బాలబాలికలను గుర్తించి వారిని బాలల సంరక్షణ గృహానికి తరలించడం జరిగిందన్నారు. ఇందులో 137 మంది బాలలు, 24మంది బాలికలు ఉన్నారన్నారు. బాలల సంరక్షణ గృహానికి తరలించిన వారిలో తెలంగాణకు చెందిన వారు 92మంది కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 69మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ తనిఖీల్లో చిన్నారులచే పనులు చేయించుకుంటున్నా ఏడుగురు షాపు యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే ఈ తనిఖీల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలికను దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించడమైనదని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీలు నిత్యం కొనసాగుతాయన్నారు. ఎవరైనా చిన్నారులతో వెట్టి చాకిరీ చేయించుకునే యాజమానుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై బాలల న్యాయ చట్టం అనుసరించి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.